2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఎత్తులకు పైఎత్తులు, నిందారోపణలతో విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటంతో తెలుగుదేశం పార్టీకి దిశ నిర్ధేశం ఉండదని అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఆ కూటమిపై అనేక సందేహాలు, సందిగ్ధతలు ఉన్నప్పటికీ సమన్వయంతో ముందుకు సాగాలని ఇరుపార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ఇరు పార్టీలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అక్టోబర్ 29న తెలుగుదేశం, జనసేన పార్టీలు పార్టీ మేనిఫెస్టోను, అభ్యర్థుల జాబితాలను వెల్లడించవచ్చని ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం నుంచి సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ సమన్వయంలో మీడియాలో అధికార పార్టీ తన కార్యక్రమాలను విస్త్రుతం చేస్తోంది.