ఇసుక విషయంలో పాలకులు ఏవిధంగా జేబులు నింపుకుంటున్నారన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియకు వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇసుక వ్యవహారాన్ని లేవనెత్తి గణాంకాలతో సహా ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తూ ఇసుక వ్యవహరంలో నైనా ప్రభుత్వం సమాధానం చెబుతుందా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అనంతమైన సహజవనరులు ఉన్న రత్నగర్భ , నదీ నదాలు ఓడరేవులు సువిశాలమైన సముద్రతీర ప్రాంతం ఉన్న రాష్ట్రమన్నారు.
భవన నిర్మాణానికి కావలసిన ఇసుక వనరులు పుష్కలంగా ఉన్నాయనీ, ఒకప్పుడు డ్వాక్రా మహిళలు ఇసుక సరఫరాను నియంత్రించారు తదుపరి ఉచితంగా ఇసుకను తీసుకుని వెళ్లే ఏర్పాటు చేశారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇసుకను వ్యాపారంగా మార్చిందని పురందేశ్వరి ఆరోపించారు. ఇసుక తవ్వకాల్లో నిభందనలకు పాతర వేసిన విషయాన్ని ఫొటోలు ద్వారా మీడియాకు ఆధారాలు చూపిస్తు వైసీపి ప్రభుత్వం వ్యవహారం పై తీవ్రస్ధాయిలో మండి పడ్డారు.
ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు పలికేది అందులో ఎక్కువ భాగం ట్రాక్టర్ ఎగుమతి, దిగుమతి ఛార్జీలు ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక అయిదు నుండి ఆరువేల రూపాయలు ధర పలుకుతోందని తెలిపారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం భారీ యంత్రాలతో తవ్వకాలు చేయకూడదు, నదీ గర్భంలో డ్రెడ్జింగ్ నిర్వహించ కూడదు, వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిపి వేయాలి ఈ విధంగా ఉన్న అనేక నిభందనలకు పాతర వేసి యధేచ్చగా ఇసుక తవ్వకాలు నిర్వహించారు ఇదే విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక నోటీసు ఇచ్చి ఫైన్ విధిస్తే ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిన విషయాన్ని పురందేశ్వరి ప్రస్తావించారు.