స్వాతంత్య్ర సంగ్రామాన భారత యువతలో పోరాట స్ఫూర్తిని నింపిన చిరస్మరణీయ యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా సైన్యాన్ని సిద్ధం చేసిన విధానం ఆయనలోని దేశభక్తిని, స్వాతంత్య్ర కాంక్షను, రణతంత్రాన్ని వెల్లడించింది. భారత జాతీయవాద నాయకుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాన్ టోక్యో నగరంలో ఉన్న రెంకోజీ టెంపుల్ సందర్శించారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనఃపూర్వకంగా అంజలి ఘటించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అక్కడి నేతాజీ స్మారకాలను దర్శించుకున్నప్పుడు ఆ పోరాట యోధుడి త్యాగనిరతి నా మదిలో మెదిలిందన్నారు. పల్లె పల్లెకు పర్యటించి భరత జాతికి వీర రసం నూరి పోసిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు చెప్పిన మాటలు స్ఫురణకు వచ్చాయని ఆయన అన్నారు. ఆ మహనీయుడు మన భరత జాతికి అందించిన స్ఫూర్తినీ, మనలో నింపిన పోరాట పటిమను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.