శనివారం కాకినాడలోని జిల్లా టి.డి.పి. కార్యాలయంలో వనమాడి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక దుమ్ములపేట సమీప ప్రాంతము నందు సర్వే నెంబర్ 1986/3D2 మరియు 1989/1A,4A గల 4 ఎకరాల 67 సెంట్ల ప్రైవేటు స్థలములకు కాకినాడ నగరపాలక సంస్థ నుండి గజం 28 వేలు చొప్పున 1:4 గా సుమారు 251 కోట్ల విలువ చేసేటువంటి టిడిఆర్ బాండ్లను మంజూరు చేయించి ఎమ్మెల్యే దోచుకున్నాడన్నారు.
ఇదే ప్రాంతాన్ని అనుకొని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అనేక ప్రభుత్వ భూములు, పోర్టు భూములు ఉండగా ద్వారంపూడి తనకి లబ్ధి చేకూరేలా ప్రైవేట్ భూములను ఎంపిక చేసి వాటికి గుట్టుచప్పుడు కాకుండా 251 కోట్లు టిడిఆర్ బాండ్లు మంజూరి చేయించారన్నారు. వాటిని వక్రమార్గాల్లో కార్పొరేషన్ సొమ్మును దోచుకుంటున్న ద్వారంపూడికి సహకరించలేక గత కమిషనర్లు బదిలీలపై వెళ్లి పోయారన్నారు. ప్రస్తుత కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ద్వారంపూడి దోపిడికి సహకరిస్తూ కార్పొరేషన్ సొమ్ములను దుర్వినియోగం చేస్తూ కార్పొరేషన్ ఖజానాను గుల్ల చేస్తున్నాడన్నారు.