తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 4వ రోజైన శనివారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… పేదలు సేవలు అందించడం లో జి.జి.హెచ్. కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాము సమ్మె చేస్తే ప్రజలకు, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్. వాటా కూడా కార్మికుల జీతాల నుండే కత్తిరిస్తున్నారని తెలిపారు.
ఈ విషయమై చాలా సార్లు అధికారులకు, కాంట్రాక్టు సంస్థ వారికి విన్నవించామన్నారు. న్యాయం జరగక పోవడం వల్లనే ఆందోళన చేపట్టామన్నారు. సోమవారం నుంచి ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు. యూనియన్ మహిళా నేత జె. లక్ష్మీప్రియ మాట్లాడుతూ… బియ్యం, నూనె, పప్పుదినుసులు వంటి నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తమకు వచ్చే జీతం కుటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. జీతాలు పెంచాలని, తమ జీతం నుండి అదనంగా కత్తిరిస్తున్న పి.ఎఫ్. సొమ్ము తిరిగి చెల్లించాలన్నారు.