వైద్యోనారాయణో హరి… అటువంటిది ప్రజలు… వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటేనేమి … తమకు నెల నెల లక్షా పదివేలు జీతం వస్తుందా.. లేదా… అన్నదే ప్రదానం అన్నట్టు కొందరు వైద్యులు వ్యవహరిస్తున్న తీరు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చర్చానీయాంశంగా మారింది. నియామకాల్లోనే అవకతవకల పర్యవసానంగా వారిని నిలదీసే నాదుడే కరువయ్యాడనే విమర్శలున్నాయి. వారు విదులకు హాజరవుతున్నదీ… లేనిదీ తమకు తెలియదని కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చెప్పడం విశేషం.
రాష్ట్రంలో ఫైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టిన స్ఫెషలిస్ట్ వైద్యుల నియామకం రెండేళ్లలో ప్రతికూల ఫలితాలిచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్క వైద్యుడికి రూ.లక్షా 10 వేలు, ఏజన్సీ ప్రాంతాల్లో రూ.లక్షా 40 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నియామకాల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 117 పోస్టులను భర్తీ చేసేందుకు 2021లో నోటిఫికేషన్ ఇవ్వగా 17 మంది నియామకమయ్యారు. జిల్లాల పునర్విభజన అనంతరం కాకినాడలో 6 మంది, అంబేద్కర్ కోనసీమలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు వైద్యులు ప్రస్తుతం పనిచేస్తున్నారు.
అయితే ఈ స్పెషలిస్ట్లు జిల్లాలోని 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సేవలందించాల్సి ఉంది. కాగా వైద్యులు విధులకు హాజరవుతున్నారా… లేదా… అన్నది జవాబుతారీతనం లేకపోడంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో సేవలందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. మధ్యాహ్నానికే ఆ కార్యక్రమాలు పూర్తవడంతో వైద్యులు తమ వ్యక్తిగత పనులకు వెళ్లిపోతున్నట్టు విమర్శలున్నాయి.
ప్రతి నెల 21వ తేదీ నాటికి తాము విధులకు హాజరైనట్టు నెలకు ఒకసారి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల నుంచి సంతకాలు తీసుకుని, ఆ పేపర్లను కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని ఎన్సీడీ విభాగానికి పంపడం పరిపాటి. ఇదిలా ఉండగా స్పెషలిస్ట్ వైద్యుల నియామకం జిల్లాల్లో చేపట్టవద్దని, రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టుల నియామకం ప్రభుత్వమే చేపడుతుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న స్ఫెషలిస్టులు మరోసారి దరఖాస్తు చేసుకోకతప్పదు…