కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 11వ రోజు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా యూనియన్ సహాయ కార్యదర్శి వి.వి.ఎన్. కుమార్, కార్మికురాలు దేవి మాట్లాడుతూ… కాంట్రాక్ట్ సంస్థ వారు తమతో చర్చలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.
గత 24 సంవత్సరాలు గా ఎన్నడూ లేని విధంగా యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ. తమ జీతాలు నుండి కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల జీతాలు సరిపోవడం లేదన్నారు. శానిటేషన్ వర్కర్స్ ఇన్ఫెక్షన్ మధ్య పని చేస్తాం కాబట్టి ఇతరుల కంటే ఎక్కువగా పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉందన్నారు.
అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ వారు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తో పాటు యూనియన్ నాయకులు సి.హెచ్. విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆసుపత్రి మాతాశిశు విభాగం వద్దనుండి ప్రదర్శన ప్రారంభించి ఓ.పి. విభాగం వద్ద ముగించారు.