వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉక్కు పోటుకి రాజకీయ పార్టీలు ప్రభావితం కానున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ జపం విశాఖ వాసులకు కొంత ప్రతిష్టగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై పెదవి విప్పకపోడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉక్కుపోటు తప్పేట్టులేదు.
ఎన్డీఏ కూటమిలోని జనసేన పార్టీపట్ల విశాఖవాసులు అంతగా శ్రద్ద కనపరచడం లేదంటున్నారు. ఇక తెలుగు దేశం పార్టీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్పై మనసువిప్పి మాట్లాడకపోడంతో విశాఖ వాసులు మీమాంసలో పడ్డారు. విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని ప్రభుత్వ పరంగానే ఉంచాలంటూ ఉవ్వెత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 8 నవంబర్ నాటికి 1000 రోజులు గడిచాయి.
విశాఖ ఉక్కు పరిరక్షణ పేరుతో విద్యార్థి సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త విధ్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్చంధంగా సెలవు ప్రకటించాయి. కార్మిక సంఘాలు మద్దతు తెలియజేశాయి. నిరుద్యోగ సంఘాలు సైతం బంద్లో పాల్గొన్నాయి.
నిరుద్యోగుల ఓట్లు కావాలంటే ప్రైవేటీకరణను ఆపండంటూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ నినదించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే పర్యవసానాలేమిటో ఆయన వివరిస్తూ అవగాహణా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగుల రిజర్వేషన్లు కోల్పోతారని వెల్లడించారు. అత్యంత ఎక్కువ నష్టపోయేది నిరుద్యోగులేననంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
32 బలిదానాలతో సాధించిన విశాఖ ఉక్కు ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద భారీ ప్రభుత్వరంగ సంస్థ. ఏవియన్ కాలేజీ విద్యార్థులతో ప్రారంభమైన ఆ ఉద్యమం, తెన్నేటి విశ్వనాథం, అమృత్ రావు ఉద్యమస్ఫూర్తితో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఒప్పించి స్టీల్ ప్లాంట్ స్థాపనకు విద్యార్థులు కారణమయ్యారు. 25 వేల మంది రైతులు తమ భూములను స్టీల్ ప్లాంట్ కు ఇచ్చారు. ఈ నేపధ్యంలో వచ్చే 2024 ఎన్నికలు విశాఖ, తెలుగు ప్రజల ఆత్మాభిమానానికి – బీజేపీ పార్టీ ప్రైవేటీకరణ పాలసీకి ప్రతిష్టగా మారనున్నాయి.