కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ బైక్ లను వినియోగించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పేర్కొన్నారు. సాంప్రదాయేతర ఇందన వనరుల సంస్థ ( నెడ్ క్యాప్ ) ఆధ్వర్యంలో స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రదర్శనను కమిషనర్ సందర్శించారు. బైక్ ల పనితీరు, ప్రయోజనాలను నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ఎలక్ట్రిక్ బైక్ లను వినియోగం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. రూ 1,33,000 నుంచి 1,85,000 వరకు వివిధ మోడల్స్, కంపెనీల లో బైక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. మూడు గంటల పాటు పూర్తిగా చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చునన్నారు.
నెడ్ క్యాప్ అధికారుల సమాచారం ప్రకారం ఆ చార్జింగ్ కు 40 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. అదే 100 కిలోమీటర్లను పెట్రోల్ పై వినియోగించాలంటే 200/. కు పైబడి ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి ముందస్తు సొమ్ము (డౌన్ పేమెంట్) చెల్లించకుండానే వాయిదాల పద్ధతిపై కట్టే వెసులుబాటును కూడా నెడ్ క్యాప్ కల్పిస్తోందన్నారు. ఆసక్తి కలిగిన నగరపాలక సంస్థ ఉద్యోగులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నెడ్ కాప్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ, నగరపాలక సంస్థ ఎలక్ట్రికల్ ఏ.ఈ. సాంబశివరావు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.