శ్రమనే నమ్ముకుని కష్టపడి పని చేసుకుని కడుపు నింపుకుంటున్న కష్టజీవులకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు మేరకు భూ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి 200 రోజులు పని దినాలు కల్పించి 600 రూపాయలు వేతనం చెల్లించాలన్నారు. ఈ డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన అన్నారు.
శనివారం ఉదయం 7 గంటల నుండి కాకినాడ రూరల్ పండురు, నేమం, తమ్మవరం, పెనుమర్తి, సూర్యారావుపేట, తదితర గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్యటన జరిగింది. ఈ పర్యటనలో కూలి దండు మాసపత్రిక సభ్యత్వాలు చేర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కమ్యూనిస్టు పార్టీలు పోరాట ఫలితంగా ఏర్పడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బి.జె.పి. ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని అన్నారు.
దీన్ని ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి వేతనం 600 చేయాలని వలస కార్మికులను ఆపాలంటే 200 రోజులు పని దినాలు కల్పించాలని మధు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు, ఉపాధ్యక్షులు రామకృష్ణ, రైతు సంఘం నాయకులు ఎం. శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుజాత, రత్నప్రభ, సామ్యూల్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.