జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపేందుకు శనివారం పిఠాపురం వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీ పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. తల్లి సురేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలసి శక్తి పీఠం పురూహుతికా అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు చక్ర దర్శనం చేయించి వేద ఆశీర్వచనాలు అందించారు. ఆయన రాక తెలుసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడింది. ఆలయం వెలుపల వేలాది మంది అభిమానులు ఆయనకి జేజేలు పలికారు. వాహనం నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు.