ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పేలవమైన పనితీరు కనబరిచిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో తమ నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీ.జే.పీ., ఎన్.సీ.పీ. కూటమి విజయంపై దృష్టి సారించనున్నట్లు ఆ పార్టీ పేర్కొంది.
పార్టీ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన మహారాష్ట్ర బీ.జే.పీ. కోర్ గ్రూప్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీ.జే.పీ. ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ… మహారాష్ట్రలో నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. ఈ సమావేశానికి బీ.ఎల్. సంతోష్, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, చంద్రశేఖర్ బవాన్కులే, సుధీర్ ముంగంటివార్, సహా పలువురు సీనియర్ బీ.జే.పీ. నేతలు హాజరయ్యారు.