ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని రాష్ట్ర సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై.ఎస్. జగ్మోహన్ రెడ్డి అనేక పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన అన్నారు. పాలనా సంస్కరణలు అంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, నాడు- నేడు ద్వారా విద్యారంగంలో అనేక పాఠశాలలు బాగు చేయడం తదితర కార్య్రమాలు ఉన్నాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అంటే అమ్మఒడి, నేతన్న నేస్తం, వసతి దీవెన , విద్యా దీవెన, ఆరోగ్య సురక్ష, వంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయని ఆయన అన్నారు.
సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వృద్ధుల ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించి వారిని గౌరవించుకుంటున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం అని ఆయన అన్నారు. అదేవిధంగా అభివృద్ధి పరంగా తీరప్రాంతాల మీద దృష్టి పెట్టిన ఏకైక ప్రభుత్వం అని ఆయన అన్నారు. రామాయంపేట పోర్టు, శ్రీకాకుళంలో మూలపేట పోర్టు, కాకినాడలో గేట్వే పోర్టు, మచిలీపట్నం పోర్టు, అదే విధంగా 17 మెడికల్ కాలేజీలు, ఎనర్జీ ప్రాజెక్టులు వంటివి పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయని ఆయన అన్నారు. రామాయంపట్నం దగ్గర 40 వేల కోట్లతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే పరిశ్రమ వస్తుందని, ఇంత భారీ పరిశ్రమ భారతదేశంలోనే లేదని ఆయన అన్నారు.