ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. పని అయిపోయిందని ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. అందుకే జనసేన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని, సోషల్ మీడియా వేదికగా వై.సీ.పీ. నాయకులు రకరకాల కుట్రలు పన్నుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఉన్నతిని దృష్టిలో పెట్టుకొని ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… జన సైనికులు వై.సీ.పీ. పన్నిన విషపు ఉచ్చులో పడకుండా స్థిమితంగా ఆలోచించాలన్నారు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ తన సొంత సొమ్ముతోనే జనసేన పార్టీని ఇంత వరకు నడిపించారన్నారు. ఎప్పుడూ పదవుల కోసం ఆలోచించని నాయకుడు. పార్టీ బలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని సీట్లు అడగాలో ఆలోచించే అడుగుతారన్నారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలనే ఒకే లక్ష్యంతో పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో కొన్ని త్యాగాలు చెయ్యాలని అన్నారు.