పెన్షన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు సచివాలయం వద్ద కుప్ప కూలిపోయిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… అమలాపురంలోని పోస్టల్ కాలనీ వద్దగల పేరూరు సచివాలయం 4 వద్దకు పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన కొంకాపల్లి కి చెందిన కురసాల నరసింహంమూర్తి కూర్చునేందుకు స్థలం లేక ఉదయం నుండి ఎండలో నిలబడి ఉన్నాడు. 10 గంటలకు సచివాలయానికి వచ్చిన సిబ్బంది పెన్షన్ గురువారం ఇస్తామని చెప్పడంతో ఆందోళన కు గురైన వృద్ధుడు రోడ్డుపై కుప్పకూలిపోయాడు.
ఈ హఠాత్ పరిణామానికి బెంబేలెత్తిపోయిన మిగతా పెన్షన్ దారులు ప్రతి నెలా 1 వ తేదీన వాలంటీర్లు ఇంటివద్దకే వచ్చి పెన్షన్ లు ఇచ్చేవారని ఇప్పుడు ఎన్నికల పేరుతో సచివాలయానికి రమ్మని చెప్పారని స్థానికులు వాపోయారు. అయితే ఎన్నిగంటలకు రావాలో చెప్పక పోవడంతో తాము ఉదయాన్నే వచ్చి సచివాలయం వద్ద ఉన్నామని అన్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న తమకు ఇంత దూరం రావడం చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు.